వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,కోటపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, రైతులకు కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిన తహసీల్దార్ రాఘవేందర్ రావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది ప్రజలు, రైతులు వివిధ పనుల నిమిత్తం వచ్చే తహసీల్దార్ కార్యాలయంలో త్రాగునీరు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ త్రాగునీటి సదుపాయం కల్పించాలని అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తహసీల్దార్ రాఘవేందర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కార్యాలయానికి వచ్చే ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్కు గురై అనారోగ్యం పాలైతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు.కార్యాలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించని తహసీల్దార్పై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మర్మల శంకర్, నాగమల్లు, మడే వెంకటేష్, భీమేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం