వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీని శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.సమావేశంలో 13 మంది సభ్యులతో కూడిన మండల కార్యవర్గం, 21 మంది సభ్యులతో కూడిన మండల కౌన్సిల్ను ఏకగ్రీవంగా ఆమోదించి నూతన మండల కమిటీని ప్రకటించారు. మండల కార్యదర్శిగా వనం సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తాళ్లపల్లి వీరయ్య, కోశాధికారిగా బండారి రాజేశం, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రోడ్డ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తూ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, నక్క వెంకట్స్వామి, మామిడి గోపి, మహిళా నాయకురాలు రోడ్డ తిరుమలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం