వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చెలిమెల కొలం గుడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన తొలి దశలోనే నిలిచిపోయాయి. పునాదులు వేసిన తర్వాత నెలలు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పునాదుల్లో నీరు నిలిచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామస్థుల కథనం ప్రకారం, కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్లకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏఈని నియమించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కనిపించడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై తిర్యాని ఎంపీడీవోను వివరణ కోరగా, కాంట్రాక్టర్లను పలుమార్లు సంప్రదించినప్పటికీ వారు స్పందించడం లేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాని లబ్ధిదారులు నేరుగా తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని, అందిన ఫిర్యాదులను పరిశీలించి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురికాకుండా నిలిచిపోయిన నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించి, బాధ్యులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం