వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులములకు చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 39 సంవత్సరాల లోపు న్యాయ శాస్త్ర పట్టభద్రులకు 3 సంవత్సరాల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని, శిక్షణ కాలంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంధాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకసారి 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల న్యాయ శాస్త్ర పట్టభద్రులు ఆన్ లైన్ లో EPASS-https://Telanganaepass.cgg.gov.in లో జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు భారత్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండాలని, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్లు మీ -సేవా ద్వారా జారీ చేయబడిన ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత దరఖాస్తు, పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం