వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : సింగరేణి సంస్థ పరిధిలోని ఓసిపి -III, సిహెచ్ పి (ర్ జి -2) ఏరియాలో కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత గాలిలో దీపంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న 'ఫైర్ కోల్' (మండుతున్న బొగ్గు) కారణంగా వెలువడుతున్న విపరీతమైన ధూళి, పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యపై సి హెచ్ పి అఖిలపక్షం ఆధ్వర్యంలో డైరెక్టర్ (ఆపరేషన్స్)కు వినతి పత్రం సమర్పించారు. మండుతున్న బొగ్గు నుంచి వచ్చే పొగ వల్ల కార్మికులు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా మారుతోందని ట్రేడ్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 1.75 కోట్ల భారీ వ్యయంతో 2023లో ఏర్పాటు చేసిన 'డస్ట్ సెపరేషన్ సిస్టమ్'ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. ఇది ఏమాత్రం పనిచేయకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతోంది. ఫైర్ కోల్ వల్ల సుమారు 16,000 బంకర్లు దెబ్బతినడమే కాకుండా, స్లో ఫీడర్లు కాలిపోతున్నాయి. దీనివల్ల బొగ్గు రవాణాకు ఆటంకం కలిగి సంస్థకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. వేడి బొగ్గు కారణంగా పలువురు అధికారులు, కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి.సమస్యకు శాశ్వత పరిష్కారంగా పూర్తిస్థాయిలో వాటర్ పాండ్స్ ఏర్పాటు చేయాలి.ఫైర్ కోల్ను ఆ పాండ్స్లో నింపి లిఫ్టింగ్ చేయడం ద్వారా మంటలను, పొగను నియంత్రించాలి.డస్ట్ సెపరేషన్ సిస్టమ్కు అవసరమైన నీటి వనరులను సమృద్ధిగా కల్పించాలి. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Admin
వాస్తవ గమ్యం