వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 04 మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తూ సాధికారత వైపు అడుగులు వేయాలని వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వయోజన విద్యాశాఖ జిల్లా ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సహకారంతో నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే చదువును మధ్యలో నిలిపివేసిన మహిళలు ఓపెన్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. చదువుకున్న మహిళలు చదువురాని వారికి స్వచ్ఛందంగా విద్యను బోధించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కుట్టు శిక్షణ పరీక్ష పత్రాలను ఆయన విడుదల చేశారు.వయోజన విద్యాశాఖ నిజామాబాద్ జిల్లా డైరెక్టర్ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు 100 రోజుల పాటు విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. మహిళలను సాధికారత వైపు నడిపించడంలో కుట్టు శిక్షణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.మంచిర్యాల ప్రాజెక్టు ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సఖి క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డీఆర్పీ బండ శాంకరి, సుమన్ అధ్యక్షత వహించగా, కుట్టు శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, ఆర్గనైజర్ ఉప్పులేటి నరేష్, శిక్షకురాలు ఉప్పులేటి శారదతో పాటు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం