వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రిలో సింగరేణి ప్రభావిత ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పాలకుల మాటలు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమయ్యాయా? అని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ నిలదీశారు. గత రెండు నెలలుగా ఉపాధి కోల్పోయి 220 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు వీధిన పడి రోదిస్తున్నా, అటు అధికారులు గానీ, ఇటు పాలకులు గానీ పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన మండిపడ్డారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేపట్టిన నిరసన దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా శనివారం కెకె-5 గని పై కార్మికుల సమక్షంలో భిక్షాటన చేపట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.సింగరేణి మనుగడ కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన భూనిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పిన యజమాన్యం, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి 220 కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణం. అవసరం తీరాక 'బొడమల్లన్న' చందంగా వ్యవహరించడం పాలకులకు తగదు. రేపు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకుని హామీలు ఇస్తారు?ఏరియా జనరల్ మేనేజర్ మానవతా దృక్పథంతో ఆలోచించి, 123 పోస్టులతో కొత్త టెండర్లను పిలిచి, బాధితులందరికీ ఉపాధి భరోసా కల్పించాలి.కార్మిక గుర్తింపు సంఘం ఐ న్ టీ యూ సి మరియు ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ లు ఇంతమంది కార్మికులు రోడ్డున పడితే స్పందించకపోవడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే. ఇప్పటికైనా ఈ పోరాటానికి వారు మద్దతు తెలపాలి. "భూములు పోయి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉన్న చిన్న ఉద్యోగాన్ని కూడా లాక్కోవడం సరైనది కాదు. తక్షణమే సెక్యూరిటీ గార్డుల సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం." అని దూలం శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు.
Admin
వాస్తవ గమ్యం