వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎం. కోదండరాంకు వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన కోదండరాంకు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు 38 రోజుల పాటు వేతనాలు కోల్పోయి సమ్మెలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఉద్యమకారుల హోదా కల్పించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 250 గజాల ఇంటి స్థలం, రూ.50 వేల పెన్షన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు, బస్సు-రైలు ప్రయాణంలో ఉచిత సౌకర్యం, ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం తదితర సంక్షేమ పథకాలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని నాయకులు కోరారు.అదేవిధంగా, సకల జనుల సమ్మె సమయంలో కొంతమంది కార్మికులకు మాత్రమే స్పెషల్ లీవ్ మంజూరు చేసి వేతనాలు చెల్లించారని, వేలాది మంది కార్మికులు సిక్ లీవ్ వినియోగించుకున్నందున వారికి కూడా స్పెషల్ లీవ్గా పరిగణించి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చించి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు ఎం. అంజయ్య, దేవులపల్లి రామస్వామి, మేడ రాజలింగు, రాజు, టీ. జనార్దన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం