వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బి ఆర్ ఎస్ మాజీ భీమారం మండల పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ అన్నారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బి ఎల్ ఓ లు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి, అవసరమైన ఫారాలు నింపించి, వాటికి సంబంధించిన రిసీవ్డ్ కాపీని ఓటర్లకు అందజేయాల్సి ఉంది. అయితే భీమారం గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామాలలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు.అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతోందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ బి ఎల్ ఎ లకు మాత్రమే ఫారాలు అందించి, ఇతర రాజకీయ పార్టీల బి ఎల్ ఎ లకు సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు.భీమారం గ్రామ పంచాయతీలో బిఎల్ఓ లను ఒకేచోట కూర్చోబెట్టి ప్రజలను అక్కడికే రమ్మని చెప్పడం, వచ్చిన ఓటర్లతో నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించడం జరుగుతోందని పలువురు ఓటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. “చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు” అనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దీనిపై రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.గడువు పొడిగించిన నేపథ్యంలో బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని కలగూర రాజకుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాసరి మణి దీపక్, మాజీ వైస్ ఎంపీపీ జనంపల్లి సమ్మయ్య, సీనియర్ నాయకులు చిప్ప పురుషోత్తం, సూరం లచ్చన్న, యువ నాయకులు కుంబ్రే బబ్లు, మాజీ వార్డు సభ్యుడు పూజారి కృష్ణ, ఆరెపల్లి రాజబాబు, చకినారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం