Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతున్నా, ప్రయాణికులు తలదాచుకోవడానికి నిలువ నీడ లేకపోవడంతో తీవ్ర ఎండలకు తట్టుకోలేక పలువురు సొమ్మసిల్లి పడిపోతుండటం స్థానికులను కలచివేస్తోంది. దీనికి తోడు, ఓ వ్యక్తి బస్టాండ్ సమీపంలోని ఫుట్పాత్ను కబ్జా చేయడంతో సామాన్యుల రాకపోకలకు మరింత ఆటంకం కలుగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పర్యటించే సమయంలో చిన్న ప్లాస్టిక్ కవర్ కనిపిస్తేనే పంచాయతీ కార్యదర్శులకు కఠిన ఆదేశాలు జారీ చేసే జిల్లా అధికారులకు, నడిబొడ్డున కనిపిస్తున్న ఈ కబ్జాలు, ప్రయాణికుల దుస్థితి ఎందుకు కనబడటం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రంలోనే అన్ని శాఖల కార్యాలయాలు ఉన్నా, అధికారులు నిత్యం ఇటే వెళ్తున్నా.. కళ్లముందున్న సమస్యను పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి అక్రమ కబ్జాలను తొలగించి, ప్రయాణికులకు నీడ కల్పించాలని కోరుతున్నారు.
Admin
Vastava Gamyam