వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు వ్యాపారస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మందమర్రి సీఐ రమేష్, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు, వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని వివరించారు.సీఐ రమేష్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రతి వ్యాపారస్తుడు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాలు ఉండడం వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు తగ్గడమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి కేసులను వేగంగా ఛేదించేందుకు సీసీ ఫుటేజ్ పోలీసులకు "మూడో కన్ను"లా ఉపయోగపడుతుందని తెలిపారు.దుకాణాల వద్ద ఒక కెమెరా లోపలి భాగాన్ని, మరొకటి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వ్యక్తులు స్పష్టంగా కనిపించేలా బయట వైపునకు అమర్చాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వ్యాపార సంస్థల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం