వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో బీఆర్ఎస్ నాయకులు హనుమండ్ల జగదీష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్భాటాలకు దూరంగా కేకులు, ఫ్లెక్సీలపై వృథా ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు.అనంతరం మాదారం నుండి తిర్యాని వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా వెట్మిక్స్తో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు హనుమండ్ల జగదీష్ మాట్లాడుతూ, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని ప్రజా సేవా దినోత్సవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కేకులు, ఫ్లెక్సీలపై ఖర్చు చేసే బదులు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం కేటీఆర్ ఆశయమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందించడం ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందించామని పేర్కొన్నారు.మాదారం–తిర్యాని రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు, విద్యార్థులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం