వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. శనివారం రొయ్యలపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.గ్రామానికి చెందిన రావుల సుజాత, జీవన్ దంపతులు తాము కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గోడిసెల బుట్టరెడ్డి, అతని భార్య సమ్మక్క కలిసి ఆ పిల్లర్ రాడ్లను కూల్చివేశారు. ఈ క్రమంలో బాధితులను కులం పేరుతో దూషిస్తూ అరాచకానికి పాల్పడ్డారని రవి ఆరోపించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో దళితులను లక్ష్యంగా చేసుకుని బుట్టరెడ్డి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పెత్తందారులకు ఊడిగం చేస్తున్న కోటపల్లి ఎంపిడిఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వల్లే పెత్తందారులకు బలం చేకూరుతోందని విమర్శించారు.లేని పక్షంలో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంకె రవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, ఆత్రం సంపత్, దుర్గం గంగారాం, దుర్గ మహేష్, బాధితులు రావుల సుజాత, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం