వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.తనిఖీల సందర్భంగా బస్సుల డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా తదితర పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న బాధ్యతను ప్రతి డ్రైవర్ గుర్తుంచుకొని అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ, పాఠశాల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యాలు కూడా బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అర్హతలు, వాహనాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం