వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలపై బలప్రయోగం, పోలీసు చర్యలను ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన ఆందోళనలను అణచివేయడం తగదన్నారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని, ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఆందోళనల సందర్భంగా అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన సాగించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు "నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు జోహార్లు", "భారత రాజ్యాంగం వర్ధిల్లాలి", "పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప మరొకటి కాదు" అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కార్యదర్శులు ఏ. రాజేశం, రాజిరెడ్డి, జి. లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్, పోషన్న, బాపు, సత్యనారాయణ, బి. మల్లయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం