వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలాపూర్, భివండి ప్రాంతాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన నేత కళాకారులను పూల బొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి జీవితాంతం ఉద్యమం చేశారని, తెలంగాణ కోసం సిరిపురపు యాదయ్యతో పాటు అనేక మంది నేత కార్మికులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగలేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే, రాష్ట్రంలో సుమారు 15 శాతం జనాభా కలిగిన పద్మశాలీయులు రాజకీయాలకు అతీతంగా ఐక్యమై రాజ్యాధికారంలో వాటా సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ, మంత్రివర్గం, కార్పొరేషన్లలో తమకు తగిన ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలని, రాబోయే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని వెంకటయ్య కోరారు.ఈ సందర్భంగా పద్మశాలి, బీసీ, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు సీహెచ్ మొగిలి, ఏ. సాగర్, కె. కృష్ణమూర్తి, రాజలింగు, మల్లయ్య, రాజమౌళి, లచ్చయ్య, నారాయణ, చిందం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం