Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఒకరు సదాశివపేట ఆస్తి పన్ను తగ్గింపు కోసం.సదాశివపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డి ఒక ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.బాధితుడికి రావాల్సిన రూ. 1.04 లక్షల ఇంటి పన్నును రూ. 35 వేలకు తగ్గిస్తానని నమ్మించి, అందుకు రూ. 35 వేలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న నిఖిల్రెడ్డి, గురువారం మిగిలిన రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. రెండోది భద్రాద్రి జిల్లా పోడు భూమి విషయంలో.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేశ్ ఏసీబీకి చిక్కాడు. ఒక రైతు సాగు చేసుకుంటున్న పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు నరేశ్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో నరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Admin
Vastava Gamyam