వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎయిర్టెల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్థానిక వాకర్స్ మరియు యోగా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.మైదానంలో ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్ మరియు యోగా చేస్తుంటారు. పాఠశాల ఆవరణలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే రేడియేషన్ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే ఇక్కడే ఉన్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు. చిన్న పిల్లల ఆరోగ్యంపై టవర్ ప్రభావం పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.వందల సంఖ్యలో క్రీడాకారులు, స్థానికులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం వల్ల ఆటలకు, వ్యాయామాలకు ఆటంకం కలుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు.వందలాది మంది ఆరోగ్యం మరియు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో కాకుండా టవర్ను వేరే చోటికి తరలించాలని వాకర్స్ & యోగా గ్రూప్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Admin
వాస్తవ గమ్యం