వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రజల ఇళ్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ సోమవారం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విజిత్ కుమార్ మాట్లాడుతూ.నస్పూర్, మంచిర్యాల ప్రాంతాల్లో కలిపి 10,332 ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో సుమారు 500 నివాస గృహాలు, మార్కెట్ ఏరియాలోని సర్వే నంబర్ 87లో సుమారు 120 ఎకరాల స్థలంలో గత 50 ఏళ్లుగా ప్రజలు ఇళ్లు నిర్మించుకుని మున్సిపల్ అనుమతులు, ఇంటి నంబర్లు పొందడంతో పాటు క్రమం తప్పకుండా మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు.గత ప్రభుత్వాలు అమలు చేసిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా పలువురు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారని, ఆ భూములకు ఆర్ఓఆర్ చట్టం కింద అప్పటి తహసీల్దార్లు రికార్డులు అమలు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ నస్పూర్, మంచిర్యాల మార్కెట్ ఏరియా, జన్మభూమి నగర్, రామ్నగర్, గర్మిళ్ల, హమాలీవాడ, దొరగారిపల్లి ప్రాంతాల్లో పట్టా భూములు కలిగి, ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారిని సైతం నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని అన్నారు.అలాగే ఎన్టీఆర్ నగర్, తిలక్ నగర్, రాజీవ్ నగర్, అండాలమ్మ కాలనీ ప్రజలకు గత ప్రభుత్వాలు పట్టాలు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం 22ఏ జాబితాలో చేర్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.ప్రభుత్వం వెంటనే 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధిత ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిషేధిత జాబితాలోని ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.ప్రజల ఇళ్లను 22ఏ జాబితా నుంచి తొలగించకపోతే బాధితులతో కలిసి ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని విజిత్ కుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం