వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి స్థానిక హరి హర దేవస్థానంలో సంకష్టహర చతుర్థి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళకరుడైన గణపతిని ఆరాధిస్తూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం నుంచే గణనాథుడికి శాస్త్రోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గణపతి హోమం పంచామృత అభిషేకాలు, షోడశోపచార పూజలు నిర్వహించారు.స్వామివారిని గరిక, మందార పూలతో సుందరంగా అలంకరించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో "సంకట నాశన గణేశ స్తోత్రం" పఠనం భక్తులను పరవశింపజేసింది. విఘ్నేశ్వరుడికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు.లోక కళ్యాణార్థం మరియు భక్తుల విఘ్నాలు తొలగాలని గణపతి హోమం నిర్వహించారు. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం చంద్రోదయ సమయంలో ప్రత్యేక హారతి ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.సంకష్టహర చతుర్థి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ కోరికలు నెరవేరాలని, సకల కష్టాలు తొలగిపోవాలని భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Admin
వాస్తవ గమ్యం