వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.బుధవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్, ఎయిడ్స్ కోఆర్డినేటర్ నీలిమతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత విస్తరించి, స్క్రీనింగ్ సేవలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం లక్ష్యాలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.చికిత్స పొందని హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షలను ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్మికులు, అధిక ప్రమాదం ఉన్న కార్మిక వర్గాల కోసం ప్రత్యేక ఆరోగ్య, హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి బాధితులకు సామాజిక సంరక్షణ, మద్దతు, భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన లబ్ధిదారులు సంబంధిత ఆన్లైన్ పోర్టల్ల ద్వారా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్ జిల్లాలో హెచ్ఐవి నియంత్రణ చర్యల పురోగతిని వివరించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా చెన్నూర్లో నూతన ఐసీటీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, లింక్ ఆర్ట్ సెంటర్ సిబ్బంది, హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం