వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, ప్రోగ్రాం అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతీయ వైద్య విధానం ఆదర్శంగా నిలిచిందని, ఎన్నో రకాల వైద్య పద్ధతుల ద్వారా వ్యాధులను నయం చేసే విధానాలను అవలంబించడం జరుగుతుందని తెలిపారు. భారతీయ వైద్య వ్యవస్థలో హోమియో, ఆయుర్వేదం, యునాని, యోగ వంటి అనేక పద్ధతులలో వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్త పటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి, న్యాచురోపతి, యోగ వంటి విధానాల ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అతి సాధారణ ఖర్చులతో ప్రకృతికి దగ్గరగా యోగ, ఫిజియోథెరపీ ద్వారా అందించే చికిత్సకు మంచి ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, గ్రామీణ స్థాయి నుండి పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, మన జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్యులు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం