Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తమకు తిరిగి ఉద్యోగాలు లభించనున్నాయని సెక్యూరిటీ గార్డులు ఆనందం వ్యక్తం చేశారు.దాదాపు రెండు నెలలుగా ఉద్యోగాలు లేక, జీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే తమ సమస్యను హైదరాబాద్ సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల బాధలను ఓపికగా విన్న మంత్రి.తక్షణమే స్పందించి సింగరేణి సి.అండ్.ఎమ్.డి బుద్ధా ప్రకాష్తో మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో స్పందించిన యాజమాన్యం.మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా 213 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఉద్యోగాలు ఇప్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్యూరిటీ గార్డులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుటుంబాలతో కలిసి మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు జావీద్, ఈసక్, మరియు సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam