వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు, కమిషన్ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం, గ్రామాల్లో మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి సంక్షేమం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో 56,969 మంది ఎస్టీలు, 1,99,493 మంది ఎస్సీలు ఉన్నారని పేర్కొంటూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు, పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం, బ్యాంకు లింకేజీ రుణాలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.అట్రాసిటీ కేసుల త్వరితగతిన విచారణ, బాధితులకు సకాలంలో పరిహారం, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించాలని, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి సకాలంలో వేతనాలు, పీఎఫ్, బీమా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పౌరసరఫరాల కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం