వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం మందమర్రి ఏరియాలోని ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులతో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించబడుతోందని ఆయన స్పష్టం చేశారు. సంస్థలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్లైన్ రికార్డింగ్ వ్యవస్థలు అమల్లో ఉన్నాయని వివరించారు. రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణాలో హైదరాబాద్లోని మార్కెటింగ్ విభాగం ద్వారా SAP ఆధారిత వ్యవస్థలో బొగ్గు కేటాయింపులు జరుగుతాయని, ఖాళీ వాహనాల బరువు నమోదు నుంచి లోడింగ్, వెయ్బ్రిడ్జ్ తనిఖీలు, అధికారిక వే-బిల్ జారీ వరకు ప్రతి ప్రక్రియ కంప్యూటరీకరించబడిందని తెలిపారు. వాహనం బయలుదేరిన వెంటనే. వినియోగదారులకు, మార్కెటింగ్ విభాగానికి, సంబంధిత అధికారులకు ఆన్లైన్ ద్వారా సమాచారం చేరుతుందని పేర్కొన్నారు.బొగ్గు రవాణా చేసే అన్ని వాహనాలకు GPS/GPRS ట్రాకింగ్ వ్యవస్థ అమలులో ఉందని, వాహనం ఎక్కడ ఉంది, ఏ మార్గంలో వెళ్తోంది, ఎక్కడ ఆగింది, గమ్యస్థానానికి చేరిందా వంటి వివరాలు రియల్ టైమ్లో పర్యవేక్షించబడుతున్నాయని చెప్పారు. జియోఫెన్సింగ్ సాంకేతికత కారణంగా వాహనం నిర్దేశిత మార్గం నుంచి మళ్లితే సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్తాయని వివరించారు.సింగరేణి గనులు, వెయ్బ్రిడ్జ్లు, CHPలు, ఎంట్రీ-ఎగ్జిట్ గేట్లు, రైల్వే సైడింగ్లు, స్టాక్ యార్డుల వద్ద RFID ఆధారిత బూమ్ బ్యారియర్లు, వందలాది CCTV కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలూ నిఘా నిర్వహిస్తున్నామని తెలిపారు. Coal Net డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రతి లారీ, ప్రతి వ్యాగన్ బరువు ఆన్లైన్లో నమోదు అవుతుందని, లోడింగ్, అన్లోడింగ్ సమయంలో నమోదైన బరువులను సరిపోల్చి ఏవైనా తేడాలు ఉంటే సంబంధిత రవాణా కాంట్రాక్టర్ల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల భౌతిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, హోలోగ్రామ్ కలిగిన అధికారిక చలానాలనే అనుమతిస్తున్నామని చెప్పారు. రైలు మార్గం ద్వారా జరిగే బొగ్గు రవాణా కూడా ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ల ప్రకారం పూర్తిగా SAP ఆధారంగా నిర్వహించబడుతోందని తెలిపారు.సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తూ చెక్పోస్టులు, స్టాక్ యార్డులు, రవాణా మార్గాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు ప్రతి టన్ను బొగ్గు RFID, GPS, CCTV, Coal Net, ఎలక్ట్రానిక్ వెయ్బ్రిడ్జ్లు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హోలోగ్రామ్ చలానాలు, టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి సాంకేతిక, భద్రతా వ్యవస్థల మధ్య నిర్వహించబడుతోందని తెలిపారు.అందువల్ల బొగ్గు మాయమవడం లేదా చోరీ జరగడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. "ప్రతి టన్ను బొగ్గు డిజిటల్ పర్యవేక్షణలో, ప్రతి రవాణా భద్రతా నిఘాలో ఉంటుంది. పారదర్శకత, బాధ్యత, సాంకేతికతే సింగరేణి బొగ్గు నిర్వహణకు మూల సూత్రాలు" అని జీఎం ఎన్. రాధాకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకే ఏజెంట్ ఎం.డి. ఖాదిర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. రాంబాబు, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, ఐఈడీ డీజీఎం కె. కిరణ్ కుమార్, డీవైపీఎం (పర్సనల్) డి. విజయ్ సందీప్, ఇన్చార్జి క్వాలిటీ మేనేజర్ డి. ప్రదీప్ కుమార్, సీనియర్ పీఓ ఆర్. సత్యనారాయణ పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం